హైదరాబాద్లో భారీ నక్సల్స్ డంప్లు స్వాధీనం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సిపిఐ (యంయల్) జనశక్తి నక్సలైట్ల డంప్లపై కరీంనగర్ జిల్లా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక ఇంటిలో భారీ డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ అనే వ్యక్తికి చెందిన ఈ ఇంట్లోని ఈ డంప్ను పోలీసులు కనుక్కున్నారు. వందకు పైగా ఆయుధాలు, 200కు పైగా డెటొనేటర్లు, కెమెరా ఫ్లాష్లు, కంప్యూటర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఇక్కడ పోలీసులకు పలువురి చిరునామాలు, దాదాపు 40 సిడిలు, 5 స్టెన్గన్లు, 2 ఎస్. ఎల్. ఆర్లు లభించినట్లు తెలుస్తోంది.
పోలీసుల దాడిలో ముగ్గురు వ్యక్తులు కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. పోలీసుల చేతికి చిక్కినవారిని జనార్దన్, శంకరయ్య, అనిల్కుమార్లుగా గుర్తించారు. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన ఈ ముగ్గురు ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఇంటిలో అద్దెకు దిగిన వారి గురించి తమకు ఏమీ తెలియదని ఇంటి యజమాని అంటున్నారు. హిమాయత్నగర్లోనే ఉండేవారమని వారు చెప్పినట్లు ఆమె చెబుతున్నారు. ఈ ఇంటిలోకి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు.
హైదరాబాద్లోని నాచారంలో కూడా జనశక్తి నక్సల్స్కు చెందిన భారీ డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ విప్లవ సాహిత్యం, డాక్యుమెంట్లు లభించినట్లు తెలుస్తోంది. ఇంకా పోలీసుల సోదాలు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో మరణించిన జనశక్తి నేత రియాజ్ డైరీ ఆధారంగా తాము హైదరాబాద్లో దాడులు నిర్వహించినట్లు కరీంనగర్ యస్పీ చెప్పారు.
హిమాయత్నగర్లో నక్సల్స్ డంప్ బయటపడిన విషయం తెలుసుకున్న వెంటనే తిరుపతిలో ఉన్న పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. హిమాయత్నగర్, నాచారంలలో బయటపడిన డంప్లను ఆయన పరిశీలించారు.