కాంగ్రెస్ బుజ్జగింపులు: పట్టువీడని టిఆర్యస్
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగడానికి అంగీకరించాలని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రత్యేక దూత ఒకరు ఢిల్లీలో ఉన్న టి ఆర్యస్ మంత్రులను కలిసి చర్చించారు. అయితే రాజీనామాలను ఉపసంహరించుకోవడానికి టి ఆర్యస్ మంత్రులు నిరాకరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియను చేపడితే తప్ప, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయలేమని, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి ప్రయోజనాలకు కలుగుతాయని తాము తేల్చి చెప్పినట్లు టి ఆర్యస్ నేత, రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విజయరామారావు చెబుతున్నారు. వైయస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే మాటకు ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కోసమే టి ఆర్యస్ పట్టుబడుతున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ స్థితిలో వైయస్ ప్రభుత్వంలో కొనసాగే అవకాశాలు లేవని ఆయన అంటున్నారు. ముఖ్యమంత్రిని మారిస్తే కొనసాగుతారా అనే ప్రశ్నకు కూడా వారు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ఇదిలావుంటే, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు, ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి సన్నిహిత మిత్రుడు కె.వి.పి. రామచంద్ర రావు దిగ్విజయ్ సింగ్తోనూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ఇన్చార్జి కార్యదర్శి జయకుమార్తోనూ సమావేశమయ్యారు.