రూ.11కోట్లపై సిబిఐ విచారణ: బొత్సా శాఖ మార్పు
హైదరాబాద్: రాష్ట్రంలో వోక్స్ వ్యాగన్ కర్మాగారం స్థాపనకు సంబంధించిన నడిచిన వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. వశిష్ట వాహన్ కంపెనీకి చెల్లించిన 11 కోట్ల రూపాయల లెక్క తేలేందుకే సిబిఐ విచారణను కోరనున్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చరిత్ర లేని వశిష్ట వాహన్కు ఏకపక్షంగా 11 కోట్ల రూపాయలు చెల్లించనందుననే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.
భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవి నుంచి మరో శాఖకు బొత్సా సత్యనారాయణను మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. సిబిఐ విచారణ పూర్తయ్యే వరకు తన శాఖను మార్చాలని బొత్సా సత్యనారాయణ కోరారని, ఆ మేరకు సత్యనారాయణ శాఖను మారుస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్ని ఆరోపణలు వచ్చిన గత తెలుగుదేశం ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించలేదని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికే సిబిఐకి అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వశిష్ట వాహన్కు వోక్స్ వ్యాగన్ నిర్దేశం మేరకే 11 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. తాము వోక్స వ్యాగన్ డబ్బులు చెల్లించామే గానీ షూష్టర్కు కాదని ఆయన అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వశిష్ట వాహన్కు చెందిన అశోక్ జైన్ పర్యాటక ప్రోత్సాహక బోర్డు సభ్యుడని ఆయన చెప్పారు.
షూష్టర్ రాజీనామా చేసిన తర్వాత కూడా వోక్స్ వ్యాగన్ నుంచి తమకు లేఖ వచ్చిందని, తాము ర రాసిన లేఖకు జూన్ 22వ తేదీన వోక్స్ వ్యాగన్ నుంచి సమాధానం వచ్చిందని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ స్థాపనకు తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లు ప్రయత్నించిందని, తమ ప్రభుత్వం కూడా దాని స్థాపనకు చొరవ చూపిందని ఆయన అన్నారు. షూష్టర్ వ్యవహారంపై, రాష్ట్రంలో వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ స్థాపన విషయంలో జరిగిన వ్యవహారంపై వోక్స్ వ్యాగన్ సమగ్ర విచారణ జరుపుతోందని ఆయన చెప్పారు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి కె.వి. రావు బదిలీ వెనక వేరే ఉద్దేశాలు ఏవీ లేవని ఆయన అన్నారు.