గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు ఈ స్కూల్లో ఉచిత విద్యను అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 138 మందికి ఈ స్కూల్లో ప్రవేశం కల్పించినట్లు ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చరుకుగా పాల్గొంటుందని ఆయన చెప్పారు. ఈ స్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యనందిస్తారు.
ఈ స్కూల్ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరీదేవితో కలిసి హాజరయ్యారు. ఎన్. టి. రామారావు కుటుంబసభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీనటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణతో పాటు ఆయన సోదరులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. పార్టీ బరువును తమ భుజస్కంధాల మీద మోసిన పార్టీ కార్యకర్తలకు ఈ స్కూల్లో విద్యనందించాని అనుకుంటున్నట్లు హరికృష్ణ తెలిపారు.