లోక్సభ సభ్యత్వానికి మమత రాజీనామా
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెకు గురువారం లోక్సభలో తీవ్రమైన కోపం వచ్చింది. దీంతో ఆమె స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్పై కాగితాలను విసిరికొట్టడమే కాకుండా తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను స్పీకర్ తిరస్కరించారు.
పశ్చిమ బెంగాల్లో వలసలపై ఆమె ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తోసిపుచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై నాలుగు గంటల పాటు చర్చించినందున తిరిగి చర్చ చేయాల్సిన అవసరం లేదంటూ మమతా బెనర్జీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆగ్రహించిన మమతా బెనర్జీ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లి ఆ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పైకి కాగితాలు విసిరి కొట్టారు. దీంతో సభను డిప్యూటీ స్పీకర్ 25 నిమిషాలపాటు వాయిదా వేశారు. మమతా బెనర్జీపై చర్య తీసుకంటామని డిప్యూటీ స్పీకర్ చెప్పారు.
మమతా బెనర్జీ లేఖ సరిగా లేనందున దాన్ని తిరస్కరిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చెప్పారు. దాన్ని రాజీనామా లేఖగా పరిగణించడానికి వీలు లేదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ చర్య చాలా తీవ్రమైందని, దానికి ఆమె క్షమాపణ చెప్పాలని, అయితే ఆ విషయాన్ని కూడా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
