బల్లకట్టు బోల్తా: 4గురు మృతి, 13 మంది గల్లంతు
గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రు వద్ద గల కాలువలో బల్లకట్టు (నాటు పడవ) బోల్తా పడింది. దీంతో 17 మంది కాలువలో కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగినప్పుడు బల్లకట్టులో 25 మంది ఉన్నారు. ఇందులో 8 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా 17 మందిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా 13 మంది ఆచూకీ తెలియడం లేదు.
గల్లంతయివవారిలో ఎక్కువ మంది గొడవర్రు గ్రామానికి చెందినవారే. కలెక్టర్ జయలక్ష్మి, పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) సజ్జన్నార్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానది నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేసి గజ ఈతగాళ్లు గల్లంతయినవారి కోసం అన్వేషిస్తున్నారు. ఈ ప్రమాదంపై న్యాయవిచారణ జరిపిస్తామని మంత్రి కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.