సౌభాగ్యం వైయస్ ఇంటికే పరిమితం: బాబు
నెల్లూరు: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం నినాదం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇంటికే పరిమితమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆయన గురువారంనాడు నెల్లూరు జిల్లాలోని గుడివాడ, తడ తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ ప్రభుత్వం ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వ హయాంలోనే 40 లక్షల కార్డులిచ్చామని ఆయన అన్నారు.
మైనార్టిలకు తమ ప్రభుత్వ హయాంలనే న్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరించడానికి తాము ఏనాడూ ప్రయత్నించలేదని ఆయన చెప్పారు. పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని, పేదల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆయన అన్నారు. ఏడాది కాలంలోనే కేంద్ర ప్రభుత్వం రెండు మూడు సార్లు పెట్రోల్ ధరలు పెంచిందని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. రైతులకు, వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని ఆయన అన్నారు.