అమీర్, రాణీముఖర్జీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: మంగల్ పాండే సినిమా నటీనటులు అమీర్ఖాన్, రాణీ ముఖర్జీలకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా నిర్మాతలు బాబా బేడీ దీపాసాహీలకు, దర్శకుడు కేతన్ మెహతాకు, కథా రచయిత ఫరూఖ్ దోండీకి, డిస్ట్రిబ్యూటర్ యాష్ చోప్రాకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సినిమా ప్రదర్శను ఆపించాలని కోరుతూ మంగల్ పాండే వారసులు వేసిన పిటిషన్పై హైకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోగా సమాధానాలు ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించింది.
మంగల్ పాండే వారసులు రఘునాథ్, ఓంకార్నాథ్ పాండేల తరఫున ఎం.టి. సిద్దిఖి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోటి రూపాయల నష్టపరిహారాన్ని కూడా వారు కోరారు. తొలి భారత స్వాతంత్య్ర సమరయోధుడు మంగల్పాండేకు అప్రతిష్ట తెచ్చే విధంగా పాత్రను సృష్టించడాన్ని, ముఖ్యంగా వేశ్యతో మంగల్పాండేకు సంబంధం ఉన్నట్లు చిత్రీకరించడాన్ని పిటిషనర్లు తప్పు పట్టారు.