72 జీవో రద్దుకు తెలంగాణ ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్: గిర్గ్లానీ కమీషన్ నివేదికకు, 610 జీవోకు తూట్లు పొడవడానికి జారీ చేసిన 72 నెంబర్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదు, ఆరు జోన్లలోని స్థానికేతర ఉద్యోగులను వెంటనే వారి వారి సొంత ప్రాంతాలకు పంపాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు విఠల్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు ఎం. కోదండరామ్, తదితరులు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. స్థానికేతర ఉద్యోగులను వెనక్కి పంపడానికి సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో పర్యవేక్షక కమిటీని వేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని, హైదరాబాద్ ఆరవ జోన్లోకి వస్తుందని గిర్గ్లానీ కమీషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని వారన్నారు. హైదరాబాద్ను ఫ్రీజోన్ చేసే ఉద్దేశంతో గోడ మీది పిల్లిలాగా ప్రభుత్వం 72 నెంబర్ జీవోను జారీ చేసిందని వారు విమర్శించారు. హైదరాబాద్ ప్రీజోన్ అనే వివాదాన్ని సృష్టించి అందుకు కమిటీ వేయాలనే దురుద్దేశం ఆ జీవో వెనక ఉందని వారు విమర్శించారు.