భారత్ ఘోర పరాజయం: సిరీస్ సమం
ముంబాయి: ఇంగ్లాండపై మూడో టెస్టు మ్యాచ్లో భారత్ ఘోరంగా పరాజయం పాలైంది. భారత బ్యాట్స్మెన్ తొలి ఇన్నింగ్స్లోనే కాకుండా రెండో ఇన్నింగ్స్లో కూడా ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండు 212 పరుగలు భారీ తేడాతో మూడో టెస్టును గెలుచుకుని మూడు టెస్టుల సిరీస్ను 1-1 స్కోర్తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాట్స్మెన్ ఒక్కరొక్కరే పెవిలియన్ దారి పట్టారు. కేవలం 100 పరుగులకే వారు చేతులెత్తేశారు. ఈ విజయంతో ఇంగ్లాండు శిబిరంలో ఉత్సాహం ఉరకలు వేసింది. ప్రధాన క్రీడాకారులెవరూ లేకుండా సాధించిన ఈ విజయానికి వారు సంతోషించడంలో ఆశ్చర్యం లేదు.
ఇంగ్లాండు స్పిన్నర్ ఉదాల్తో పాటు కెప్టెన్ ప్లింటాఫ్ భారత బ్యాట్స్మెన్ నడ్డి విరిచారు. ఉదాల్ కేవలం 9.2 ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్లింటాఫ్కు మూడు వికెట్లు లభించాయి. అండర్సన్కు రెండు వికెట్లు, హోగార్డుకు ఒక వికెట్ లభించాయి. సచిన్ టెండూల్కర్ చేసిన 34 పరుగులే భారత బ్యాట్స్మెన్ చేసిన పరుగుల్లో అత్యధికం. వసీం జాఫర్ పది పరుగులకు, ద్రావిడ్ 9 పరుగులకు, యువరాజ్ సింగ్ 12 పరుగులకు, సెహ్వాగ్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్కు వరస కట్టారు. ఇంగ్లాండు తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసి భారీ ఆధిక్యతను సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులకు అలవుట్ అయింది. ఇంగ్లాండు రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసింది. విజయావకాశాలు మెండుగా ఉన్న మ్యాచ్ను భారత బ్యాట్స్మెన్ చేజేతులా పారేసుకున్నారు.












Click it and Unblock the Notifications
