మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్: తొలి, మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్తో పోల్చుకుంటే ఆదివారంనాడు మూడో విడత పోలింగ్ కాస్తా ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల వరదలు, మరికొన్ని చోట్ల చికున్ గన్యా వ్యాధి ప్రభావం పోలింగ్పై పడింది. అభ్యర్థులు వాహనాల్లో ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించారు. గత రెండు విడతల పోలింగ్తో పోల్చుకుంటే కోస్తాంధ్రలో ఈసారి చెదురుమొదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రకాశం జిల్లా మిరియాలపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగడాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఐదు నాటుబాంబులు విసిరారు. ఈ సంఘటలో ఇద్దరు గ్రామస్థులు, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పోలింగ్ బాక్స్ల్లో ఇంకు పోశారు. గుంటూరు జిల్లాలో చెలరేగిన ఘర్షణల్లో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య అక్కడక్కడా ఘర్షణలు చెలరేగాయి. నెల్లూరు జిల్లాలోనూ చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా బూర్గపాలెంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా చిల్లకూరు ఒక ఓటరు తన ఓటును వేరే వ్యక్తి వేసి పోవడంతో తీవ్ర గందరగోళం సృష్టించాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గ్రామస్థులు బుజ్జగించడంతో కిందికి దిగి వచ్చాడు. నెల్లూరు జిల్లాలోని తెనాలి డివిజన్లో జరిగిన ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. విశాఖపట్నం డివిజన్లోని ఒక పోలింగ్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో వరదలు తగ్గుముఖం పట్టలేదు. అయినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా లేదు. కొత్తూరు మండలంలోని ఒక గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా అవుకు శాసనసభా నియోజకవర్గం సింగనపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇది కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ మహిళ శరీరంలోకి దూసుకుపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. కడప జిల్లా గోపవరంలో బ్యాలెట్ పేపర్లు చించివేశారు. వేంపల్లిలో పోలింగ్ ఏకపక్షంగా జరుగుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం వర్గీయులు పోలింగ్ను బహిష్కరించారు. ఈ సమయంలో కాంగ్రెస్, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. అనంతపురం జిల్లాలోనూ అక్కడక్కడా ఘర్షణ చెలరేగింది.
తెలంగాణ జిల్లాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాలతో పోలిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ఉధృతంగా సాగింది. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగుడా డివిజన్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకొండ డివిజన్లో పోలీసుల పహరా మధ్య పోలింగ్ జరిగింది. జాన్పాడ్ గ్రామంలో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. వరంగల్ జిల్లా వరంగల్, జనగామ డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మెదక్ జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.