తమాషా చేస్తున్నారా:హైకమాండ్ కు ఎమెస్సార్ ప్రశ్న
హైదరాబాద్: తమాషా చేస్తున్నారా, మజాక్ ఆడుతున్నారా అని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరికి పార్టీ అధిష్ఠానవర్గాన్ని ప్రశ్నించారు. తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చకపోతే కాంగ్రెస్ పడవ మునుగుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఇస్తామనో, ఇవ్వబోమనో వెంటనే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మూడున్నర ఏళ్లు నాన్చి ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేస్తామని అంటే ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ వేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వేయాల్సి ఉండిందని ఆయన అన్నారు. ఆలోచిస్తామని, రెండో ఎస్సార్సీ వేస్తామని, ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక రాలేదని అంటూ పోవడం పార్టీకి మంచిది కాదని ఆయన అన్నారు. తాను ఈ విషయం పార్టీ అధిష్ఠానవర్గానికి చెప్పినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై అలా మాట్లాడాల్సింది కాదని తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీకి చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్తే తాము వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోతామని, కానీ తెలంగాణపై ఏదో ఒకటి తేల్చడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
