వైయస్ చేస్తున్నట్లే బాబు చేస్తున్నారు: బొత్సా
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమాలనే చేపట్టి ప్రజాదరణ పొందాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. అయితే ప్రజలు రాజశేఖర రెడ్డిని విశ్వసించారని, చంద్రబాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబునాయుడు తాను రైతుల కోసం పోరాడే ఏకైక నాయకుడిని అనిపించుకోవాలని చూస్తున్నారని, అయితే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన అన్నారు. శాసనసభలో నిద్రపోవడం వంటి నాటకాల వల్ల ప్రయోజనం ఉండదని ఆయన చంద్రబాబుకు సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల వల్ల చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, ఇప్పుడు మాట్లాడే మాటలను ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
