తెలంగాణలో చిరు ప్రభావం ఉండదు: కెసిఆర్
న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రభావం కోస్తా, రాయలసీమల్లోనే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారని, దానికే అధిక ప్రాధాన్యం ఇస్తారని, అందువల్ల చిరంజీవి ప్రభావం ఉండదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా ప్రభుత్వం తిరోగమన దిశలో పయనిస్తోందని ఆయన విమర్సించారు. పునర్విభజన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం అందుకు ముందుకు రావడం లేదని, దానివల్లనే తాము యుపిఎ నుంచి బయటకు వచ్చామని ఆయన చెప్పారు. కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని, అయినా తాము అత్యధిక మెజారిటీతో గెలిచామని, ఏడు జిల్లాలతో కలిసిన రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి రాజకీయాలకు కొత్తవారైన తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిచారని, ఇంత స్పష్టంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారని ఆయన అన్నారు. అన్ని సమస్యలకు రాష్ట్ర విభజనే పరిష్కారమని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తాము 193 నిబంధన కింద లోకసభలో చర్చను కోరామని, అది చర్చకు వస్తుందని, చర్చకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే తాము 193 నిబంధన కింద నోటీసు ఇచ్చామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
