రాజధాని ఎక్స్ప్రెస్లో పేలుడు: ఐదుగురు మృతి
గోల్ఘాట్ : అస్సాంలోని గోల్ఘాట్ జిల్లా సమీపాన రాజధాని ఎక్స్ప్రెస్లో గురువారం అర్థరాత్రి జరిగిన పేలుడు ఘటనలో ఐదుమంది మృత్యువాత పడగా, మరో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఈశాన్య సరిహద్దు రైల్వే సీపీఆర్ఓ త్రికల్ రబహా ఈ పేలుడు గురించి తెలియజేస్తూ గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. దిబ్రూఘర్ నుంచి గౌహతీ మీదుగా ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ నౌజన్, సుగజాన్ స్టేషన్ల మధ్య వెళుతున్న సమయంలో రైలులోని 2423ఏ నెంబరుగల బోగీలో ఈ పేలుడు జరిగిందని ఆయన వివరించారు.
గుర్తు తెలియని తీవ్రవాదులు పెట్టిన పేలుడు పదార్థాల కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని ఆయన తెలిపారు. పేలుడు కారణంగా గాయపడిన వారిని వైద్యసేవల నిమిత్తం దగ్గర్లోని గోలాఘాట్ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు.
ఈ పేలుడు కారణంగా లగేజీ బోగీతో పాటు ఆ ప్రాంతంలోని రైలు పట్టాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటల సమయానికి పాడైన ట్రాక్ను సరిచేయడం ద్వారా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించామని ఆయన చెప్పారు.
సంఘటన జరిగిన వెంటనే రైల్వేశాఖలోని సీనియర్ అధికారులందరూ ప్రమాద స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిగురించి, గాయపడిన వారిగురించిన వివరాల కోసం 03674-1072, 0361-1072 నెంబర్లకు లేదా 09435550664 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
