అణు ఒప్పందాన్ని తిరగదోడుతాం: బిజెపి
న్యూఢిల్లీ : అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై తాము అధికారంలోకి వస్తే మళ్లీ చర్చలు జరుపుతామని భారతీయ జనతా పార్టీ తెలిపింది. అణు ఒప్పందంపై అధికార యూపీఏ కూటమి కీలక భాగస్వాములైన లెఫ్ట్ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఈ ఒప్పందంపై అమెరికాతో మళ్లీ చర్చలు జరుపుతామని బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జావేద్కర్ మాట్లాడుతూ గుజరాత్లో తమ పార్టీ విజయం సాధించిన కారణంగా అణు ఒప్పందాన్ని అంగీకరించే విధంగా లెఫ్ట్ పార్టీలపై ఒత్తిడి పెరగనుందని అన్నారు.
దేశ జాతీయ, భత్రతా ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉందని లెఫ్ట్ పార్టీలు ఈ అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం లేదని ప్రకాశ్ పేర్కొన్నారు. అది అమెరికాతో కుదుర్చుకోవడం వలనే వ్యతిరేకిస్తున్నారని, ఇదే ఒప్పందం చైనాతో కుదిరి ఉంటే లెఫ్ట్కు అభ్యంతరాలేమీ ఉండేవి కావని విమర్శించారు.