బేనజీర్ హత్యపై ప్రపంచం దిగ్భ్రాంతి
ఈ విషయం తెలిసిన ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఒక ధైర్యశీలి అయిన మహిళా నేతను ప్రపంచం కోల్పోయిందని, ఈ లోటు ఏనాటికి పూడ్చలేనిదని ప్రపంచ దేశాలు వ్యాఖ్యానించాయి. ఉగ్రవాదం పోరులో తన ప్రాణాలు అర్పించిన భుట్టోకు ప్రముఖ నేతలందరు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భుట్టో హత్యా ఉదంతంపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత ఉపఖండం అసాధారణ ప్రజాస్వామ్య నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భుట్టో హత్యకు కారణమైన తీవ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రపంచదేశాలు ముందుకు రావాలని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ బెనజీర్ హత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సమాజ సుస్థిరతకు ఉగ్రవాదం పెనుముప్పుగా తయారైందని అన్నారు. బెనజీర్ దారుణహత్యను అమెరికా అధ్యక్షుడు జార్జ్బుష్ తీవ్రంగా ఖండించారు. బెనజీర్ హత్య వెనుక ఉన్న అరాచక శక్తుల్ని చట్టం ముందు ప్రవేశపెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా దేశంలో బెనజీర్ అడుగుపెట్టారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న లక్ష్య సాధనలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని కీర్తించారు. ఆమె ఆశయాల్ని కొనసాగించాలని ఆయన పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు.