న్యూఢిల్లీ: ఒకవేళ సోమనాధ్ ఛటర్జీ రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. కిశోర్ చంద్రదేవ్ లోకసభ స్పీకర్ పదవిని చేపట్టే అవకాశం ఉంది. పార్వతీపురం రిజర్వ్ సీటు నుంచి గెలుపొందిన కిశోర్ చంద్రదేవ్ ఆ స్థానానికి తగినవారని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కిశోర్ చంద్రదేవ్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నాయకులు యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు సమాచారం. యుపిఎకు వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న వెంటనే సోమనాధ్ ఛటర్జీ స్పీకర్ పదవి నుంచి తప్పుకోవచ్చుననే వార్తలు వెలువడుతున్నాయి. సోమనాధ్ ఛటర్జీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రభుత్వంపై పార్లమెంటులో వచ్చే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం ఉంది. నాలుగు విడతలు కిశోర్ చంద్రదేవ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.