చంద్రబాబు వైపే సిపిఎం మొగ్గు
హైదరాబాద్: రాష్ట్రంలో పొత్తుల విషయంలో సిపిఎం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ మేరకు సంకేతాలను ఇచ్చింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశానికి ముందు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ డాక్టర్ మిత్రా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరితో మాట్లాడారు. బిజెపి పట్ల ప్రజారాజ్యం వైఖరిని డాక్టర్ మిత్రాను సిపిఎం నాయకులు అడిగినట్లు సమాచారం. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మిత్రా వారికి చెప్పినట్లు తెలిసింది.
జాతీయ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా పొత్తులు ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం భావించినట్లు సమాచారం. చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనప్పటికీ అది పెద్దగా ఆమోదాన్ని పొందలేదని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేయాలనే విధానానికి అనుకూలంగా రాష్ట్రంలో పొత్తులు ఉండాలనే అభిప్రాయమే బలంగా వ్యక్తమైనట్లు సమాచారం. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో కలిసి తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనే విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలో వ్యవహరించాలనే అభిప్రాయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గంలో వ్యక్తమైంది.
రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశానంతరం సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంట సేపు వారు చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిపిఎం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము వామపక్షాలు, బిఎస్పీతో కలిసి పని చేస్తామని, వామపక్షాలు తమ వెంటే ఉంటాయని చంద్రబాబు అంటున్నారు.












Click it and Unblock the Notifications
