వారి తొలగింపు సరైందే: ధర్మాన
హైదరాబాద్: హైదరాబాదులోని భీంరావుబాడ తొలగింపును రెవెన్యూ మంత్రి ధర్నాన ప్రసాదరావు మంగళవారం శాసనసభలో సమర్థించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం భీంరావుబాడ తొలగించడానికి పూనుకుంది. ఇందులో నివాసం ఉంటున్న వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు వివరణ కోరాయి. వారికి ప్రభుత్వం తరపున రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమాధానం ఇస్తూ భీంరావ్బాడలో 96 కుటుంబాలు ఉన్నాయని వారికి ఆ భూమిపై ఎలాంటి హక్కు లేదని మంత్రి ప్రసాదరావు స్పష్టం చేశారు. అది హౌసింగ్బోర్డు స్థలమని దానికి పట్టాలు ఇచ్చే హక్కు రెవిన్యూ శాఖకు లేదని అన్నారు. అప్పటి ఆర్డీఓకు తెలియక పట్టాలు ఇచ్చారని దానికి చట్టం అనుమతి లేదని అన్నారు. అయినా తమది పేదల ప్రభుత్వం కనుక వారిని అన్యాయంగా ఖాళీ చేయించటం ఇష్టం లేక అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోనే అన్ని సౌకర్యాలతో ఇండిపెండెంట్ ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. వారు ఆనందంగా వెళ్లి ఉన్నారని రాజకీయపార్టీల వారు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. తాము వారికి హైదరాబాద్లోనే ఇళ్లు ఇచ్చాం తప్ప ఇతర జిల్లాలలో ఎక్కడో ఇవ్వలేదు కదా అని అన్నారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప అందరికీ పార్టీ ఆఫీసులు ఉన్నాయన్నారు. ఇన్నేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఓ ఆఫీసు కూడా లేదన్నారు. తాము 13 కోట్లు చెల్లించి 5వేల గజాల స్థలం పొందామన్నారు. తాము కనుక పేదలకు చిన్న ఇళ్ల స్థానంలో బ్రహ్మాండమైన ఇండిపెండెంట్ ఇళ్లు కట్టించి ఇచ్చామని అన్నారు. తాము చేసింది ముమ్మాటికీ కరక్టేనని అన్నారు.
మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే విపక్షాలు వాయిదాతీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఇందిరా క్రాంతి పథకం, ఐకేపీ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర సమస్యలపై టీడీపీ, సీసీఐ, సీపీఎం, తెరాస వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పునరుద్ధరణపై బిజెపి వాయిదాతీర్మానం ఇచ్చింది. వీటన్నిటిని స్పీకర్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.