పార్టీపై మాట్లాడను: సాంబశివుడు
హైదరాబాద్: పార్టీ గురించి మాట్లాడడానికి హోం మంత్రి కె.జానారెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు నిరాకరించారు. తాను పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. పార్టీతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు. తాను పార్టీ నాయకత్వానికి లేఖ రాసి ప్రభుత్వానికి లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. తాను నాయకత్వాన్ని కలుసుకోలేదని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధులు గుప్పించిన ప్రశ్నల వర్షానికి ఆయన క్లుప్తంగా సమాధానమిస్తూ వివరాలు మాట్లాడడానికి నిరాకరించారు.
తాము హింస చేశామని అనుకోవడం లేదని, మార్పు కోసం ఆ పని చేశామని, పార్టీ కూడా అదే అనుకుంటోందని ఆయన అన్నారు. అనారోగ్యం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనే ఆశ - ఈ రెండు కారణాల వల్లనే తాను ప్రభుత్వానికి లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. తనకు ఆరోగ్య సమస్య తలెత్తిందని, పని చేయడానికి తనకు శక్తి సరిపోవడం లేదని ఆయన అన్నారు. చికెన్ గున్యా వచ్చిందని, తీవ్రమైన మోకాళ్ల నొప్పులున్నాయని ఆయన అన్నారు.