బాబు పిట్టల దొర
హైదరాబాద్: ఓ ప్రక్క ఓట్లే లక్ష్యంగా వాగ్ధానాలు హోరెత్తుతుంటే...మరో ప్రక్క అంతే వేడిగా, వాడిగా విమర్శలూ గుప్పుమంటున్నాయి. తాజాగా తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిట్టల దొరలా ఎడా పెడా ఎన్నికల వాగ్దానాలు గుప్పించేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసి రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను ప్రజలు నమ్మరని, అసలు ఆ మానిఫెస్టోయే ఓ చిత్తుకాగితం లాంటిదని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పేదలకు ఉచితంగా ఇస్తానంటున్న కలర్ టివిలు, నిరుద్యోగులకు భృతి, సమగ్ర ఆరోగ్య పథకం వంటివి నమ్మశక్యంగా లేవని, అర్ధం పర్ధం లేని కబుర్లు చెప్పే పిట్టల దొరలే అలా మాట్లాడతారని తులసి రెడ్డి తీవ్ర విమర్శ చేసారు. 2004 ఎన్నికల మానిఫెస్టోలో 143 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ వాటిలో 139 పూర్తిగా, నాలుగు పాక్షికంగా అమలు పరిచిందన్నారు. మాట నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికే చెల్లిందని, మాట తప్పడం, మోసం చేయడం చంద్రబాబు నైజమని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం నేత వాగ్దానాలను ప్రజలు ఎంతమాత్రం నమ్మరని, పిట్టల దొర మాటలుగానే పరిగణిస్తారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications