ఎన్టీఆర్ రోడ్ షోలు ఇక లేనట్టేనా?
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మలి విడత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందుకు ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవచ్చునని డాక్టర్లు భావిస్తున్నారు. శరీరాన్ని వేగంగా కదపడం, స్ప్రింగ్ లాగా మెలికలు తిరగడం డైలాగ్ కు అనుగుణంగా శరీరాన్ని కదుపడం వల్లనే ఆయన రోడ్ షోలు విజయవంతమయ్యాయి. అవి లేకుండా జస్ట్ మైకు తీసుకుని కదలకుండా మాట్లాడం వల్ల ఎన్టీఆర్ రోడ్ షోలు రక్తి కట్టవు. డాక్టర్లు చెబుతున్న ప్రకారం జూనియర్ ఇలా కదలకుండా నిలబడి మాట్లాడవచ్చు. అయినా ఏం జరుగనుందో, ఎవరే నిర్ణయం తీసుకుంటారో వారం తర్వాత కానీ స్పష్టం కాదు.
జూనియర్ ఎన్టీఆర్ను వారం పది రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని, ఆయన పూర్తిగా కోలుకునేసరికి రెండు వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయినా.. మలివిడత ప్రచారం సందేహమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ భాస్కరరావు తెలిపారు. వారం నుంచి పది రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
రెండు మూడు రోజుల తర్వాత ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేస్తామని, ఆ తర్వాతే ఆయనను ఎప్పుడు డిశ్చార్జి చేసేదీ కచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుందని వివరించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలో ఎన్నికల పర్యటనను ముగించుకుని ఉగాది పండుగను ఇంట్లో జరుపుకోవడానికి హైదరాబాద్ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారుకు గురువారం అర్థరాత్రి నల్లగొండ జిల్లా మోతె సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications