ఇదేమైనా సినిమానా?: చిరుకు ఎన్టీఆర్ ప్రశ్న
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొస్తే మన రాష్ట్రం అంటూ చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదని, మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారని జూనియర్ ఎన్టీఆర్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల అధికారమిస్తే రాష్ట్రం మొత్తాన్ని భోంచేసేశారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే మీ అందరికీ కలర్ టీవీలు ఇస్తారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేదోడికి అందాయో లేదో తెలియదు కానీ వారి నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప తప్ప ఏమీ మిగల్లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఉచితంగా వేసుకోవడానికి గడపకు మూడు రంగులు, తలుపునకు వేసుకోవడానికి ఇందిరమ్మ బొమ్మ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.ఎక్కడ చూసినా, ఆడకూతుళ్ల మీద యాసిడ్ దాడులు, కత్తులు, వేటకొడవళ్లతో చంపడాలేనని ఆయన అన్నారు. వాకపల్లి గిరిజనులపై అత్యాచారం జరిగితే ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఆయన విమర్శించారు.తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇస్తున్న హామీలను ఆయన వివరించారు. మహా కూటమి అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్ పై పివి విగ్రహాన్ని పెట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.