హైదరాబాద్ లో జర్నలిస్టుల నిరసన
హైదరాబాద్: సాక్షి దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడిలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ హైదరాబాద్ లో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, హైదరాబాద్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం, అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 'సాక్షి' దినపత్రిక కార్యాలయంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కంప్యూటర్ లపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. అదే సమయంలో కంప్యూటర్ ముందు విధుల్లో ఉన్న 'సాక్షి' పత్రికా విలేకరి రాజశేఖర్ పై కూడా పెట్రోల్ పడటంతో నిప్పంటుకొంది. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ ప్రాణాలను రక్షించుకొనేందుకు కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు. సమీపంలోని వారు గమనించి మంటలను అదుపులోకి తీసుకొచ్చి హుటాహుటిన అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రాజశేఖర్ ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెసు శాసనభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మనుషులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ దాడిని జెసి దివాకర్ రెడ్డి ఖండిస్తున్నారు. తన వాళ్లంతా ఇక్కడే తనతోనే ఉన్నారని, సాక్షి కార్యాలయంపై దాడి చేశారని టీవీల్లో చూశానని, వారు తన అభిమానులు కారు దురభిమానులని, ఎస్పీతో మాట్లాడానని, దోషులెవరైన సరే శిక్షించాలని చెప్పానని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.
'సాక్షి' పత్రిక కార్యాలయంపై దాడిని మంత్రి రఘువీరారెడ్డి ఖండించారు. పత్రికలపై, పాత్రికేయులపై దాడి చేసి గాయపరచడం అమానుషమన్నారు. సోమవారం హైదరాబాద్లో మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సంఘటనకు కారకులపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.