కెసిఆర్ కాంగ్రెస్ లో చేరితే డిసిఎం: టీజీ
విజయవాడ: టీఆర్ ఎస్ అధినేత కెసిఆర్ తన దుకాణం మూసేసి, కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవి తప్పకుండా లభిస్తుందని రాయలసీమ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు టి.జి.వెంకటేష్ హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తలచుకుంటే కెసిఆర్ కు ఉప ముఖ్యమంత్రి పదవినైనా ఇవ్వగలరని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధలతో అన్నారు. ప్రత్యేక రాష్ట్రవాదాలు తనవంటి రాజకీ య నిరుద్యోగులు లేవనెత్తినవేనని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తే, తమ సంగతేమిటని రాయలసీమ వాసులు గళం విప్పుతారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణకు సుముఖంగా లేరని, ప్రణబ్ కమి టీ ఇదే తేల్చిందని గుర్తుచేశారు. రోశయ్య కమిటీ కూడా తన నివేదికలో సమైక్య రాష్ట్రానికే మద్దతు పలుకుతుందన్నారు. అందువల్ల తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదని వ్యా ఖ్యానించారు.అదేవిధంగా అనంతపురం జిల్లాను కర్ణాటకలో చేర్చాలన్న జేసీ దివాకరరెడ్డి సూచన అమలయ్యేది కాదన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణకే ఎక్కువ నిధు లు ఇచ్చారని, దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశామని వెల్లడించారు. సీమ హక్కుల కోసం పోరాడటంలో తప్పు లేదన్నారు. వివిధ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ పోలవరం కావాలని తాము అడిగినట్లు వివరించారు.