ఇద్దరు స్త్రీలపై యాసిడ్ దాడులు
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు మహిళలపై యాసిడ్ దాడులు జరిగాయి. కోరిక తీర్చలేదనే కోపంతో ఓ కిరాతకుడు వివాహిత ముఖంపై యాసిడ్ పోయగా తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడుతోంది. మరో దుర్మార్గుడు ప్రియురాలిపై యాసిడ్ పోసేందుకు ప్రయత్నించగా ఆమె ఎలాగోలా తప్పించుకుంది. కానీ సమీపంలోని ముగ్గురు మహిళలపై ఆ యాసిడ్ పడి వారు గాయపడ్డారు. మరో సంఘటనలో వివాహితపై కొందరు దుండగులు సామూహితక అత్యాచారానికి పాల్పడ్డారు. నూజెండ్ల మండలం మృత్యుంజయపురానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన దొడ్డా వెంకటేశ్వర్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యాసిడ్తో దాడిచేశాడు. నిద్రిస్తున్న ఆమె ముఖంపై యాసిడ్ పడటంతో తీవ్రంగా గాయపడింది.
కోరిక తీర్చకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని ఏడాదిగా వెంకటేశ్వర్లు ఆమెను వేధిస్తున్నాడు. అయితే పరువు బజారున పడుతుందనే భయంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీన్నే అలుసుగా తీసుకున్న కిరాతకుడు ఆమె ముఖంపై యాసిడ్పోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త తొలుత వినుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మేడికొండూరు మండలం పేరేచర్లలో వివాహితులైన ఎం.కుమార్, నబీల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల డబ్బు విషయమై గొడవ జరగడంతో కుమార్ను నబీ దూరంగా ఉంచుతోంది. దీనిపై ఆగ్రహించిన కుమార్ స్థానిక ఆసుపత్రిలో ఉన్న తన స్నేహితురాలి వద్దకు నబీ వెళ్లిందని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్లి ఆమెతో ఘర్షణ పడ్డాడు. అనంతరం ఆమెపై యాసిడ్ పోయడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లెపు అచ్చమ్మ, లక్ష్మీ తిరుపతమ్మ, ఉయ్యాల అంజమ్మలపై యాసిడ్పడి గాయపడ్డారు. నబీకి స్వల్పగాయాలయ్యాయి.