చిరు పార్టీలో మరో వికెట్ డౌన్?
హైదరాబాద్: పార్టీ విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన వినయ్ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. తన తండ్రి పి.శివశంకర్ తో కలిసి ఆయన రెండు మూడు రోజుల్లో ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది. టికెట్ల పంపకంలో, తనకు అడిగిన సీటు ఇవ్వకపోవడంతో వినయ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వినయ్ సనత్ నగర్ శాసనసభా నియోజకవర్గాన్ని ఆశించారు. అయితే ఆయనకు నాయకత్వం నిజామాబాద్ లోకసభ సీటును కేటాయించింది. దాంతో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పార్టీలో చిరంజీవి, ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య వినయ్ వారిధిలా పని చేశారు. రాజకీయపరంగా కాకుండా సామాజిక పరంగా మార్పు తేవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరానని, అయితే ఆ మార్పు తేవడం ప్రజారాజ్యం పార్టీ వల్ల సాధ్యమయ్యే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ కూడా సరిగా జరగడం లేదని ఆయన అంటున్నారు. చిరంజీవిని సంతోషపెట్టే మాటలే సమీక్షా సమావేశాల్లో చెబుతున్నారని ఆయన అన్నారు. టికెట్ల కేటాయింపులో తన పాత్ర ఏమీ లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications