కమిటీపై తలసాని ధిక్కారం?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చారు. ఆయన చంద్రబాబుతో సమావేశం కావాలని చూస్తున్నారు. ఈ భేటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై అధినేతకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు పార్టీకి తలనోప్పిగా మారుతున్న తలసాని వ్యవహారాన్ని సమీక్షించేందుకు సీనియర్ నేతలు ఎర్రంనాయుడు, యనమల, నాగంలతో పార్టీ తిసభ్య కమిటీ నియమించింది. ఈ కమిటీ ముందుకు గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ తలసానికి లేఖ రాసింది.
కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయానికి చేరుకోగా, తలసాని చంద్రబాబు నివాసానికి చేరుకోవడం వ్యవహారాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. చంద్రబాబు తలసానితో భేటీకి ఇష్టపడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. తాను తప్పు చేయలేదని, తాను ఏ కమిటీ ముందు కూడా హాజరు కాదలుచుకోలేదని, తాను చంద్రబాబుకు మాత్రమే జవాబుదారీని అని తలసాని శ్రీనివాస యాదవ్ అంటున్నట్లు సమాచారం. తాను ఏ విధమైన తప్పు చేయలేదని, పార్టీ బాగు కోసమే మాట్లాడానని, కావాలంటే రాజీనామా చేస్తానని శ్రీనివాస యాదవ్ చంద్రబాబుతో చెప్పాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.