కెసిఆర్ పై ఎందుకీ విద్యార్థుల ఆగ్రహం?
తాను దీక్షను విరమించలేదని పదే పదే కెసిఆర్ చెప్పాల్సి వచ్చింది. దీక్ష విషయంలో పోలీసుల వ్యవహారాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైయస్ చాన్సలర్ జయశంకర్, ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ రెండో వైపు గురించి ఆలోచించాల్సిన ఆవసరాన్ని చెప్పడంతో విద్యార్థులు ఆలోచనలో పడ్డారు. కెసిఆర్ దీక్ష విరమించలేదని జయశంకర్ చెప్పారు. నిజానికి, మీడియా మొదటి నుంచి కెసిఆర్ కు వ్యతిరేకంగా పథకం ప్రకారం ప్రచారం మొదలు పెట్టిందనే అభిప్రాయం తెరాస వర్గాల్లో ఉంది. సాక్షి వంటి దినపత్రికలు పని కట్టుకుని కెసిఆర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే అభిప్రాయం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే కెసిఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా, ఆయనపై అనుమానాలు తలెత్తే విధంగా వ్యవహరించాయని అంటున్నారు.
పలు పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు కెసిఆర్ పై తమ ఆగ్రహాన్ని తగ్గించుకుని, ఆయనకు సానుకూలంగా వ్యవహరించారు. మంగళవారం రాత్రి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నివాసం ముందు విద్యార్థులు ధర్నా చేశారు. తెలంగాణపై విద్యార్థుల ఆందోళనకు తాము మద్దతిస్తామని డి.శ్రీనివాస్ చెప్పాల్సి వచ్చింది. దానికి తోడు, తెరాస నాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం కాకూడదని వారు చెప్పే ప్రయత్నం చేశారు. గద్దర్ కూడా తన తీవ్రతను తగ్గించుకుని తనకు కెసిఆర్ తో శత్రు వైరుధ్యం లేదని, మిత్ర వైరుధ్యం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీంతో మళ్లీ కెసిఆర్ కు పరిస్థితి అనుకూలంగా మారింది.