బంద్ రెండో రోజూ భయం భయం, బందోబస్తు

Telangana Bandh
హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపు మేరకు జంటనగరాల్లో సోమవారం కూడా బంద్ కొనసాగుతోంది. ఆదివారం బంద్‌ సంపూర్ణంగా జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినా పరిస్థితి అదుపు తప్పకుండా చూడటంలో పోలీసులు సఫలమయ్యారు. బంద్‌ సందర్భంగా ఆర్టీసీ బస్సులను నడపకపోవటంతో జనం తీవ్రఇక్కట్లకు గురయ్యారు. సాయంత్రం వరకు పెట్రోల్‌ బంకులు కూడా మూసి ఉండటంతో వాహనదారులు అవస్థలుపడ్డారు. ఇదే అవకాశంగా ఆటోవాలాలు అందినకాడికి దండుకున్నారు.ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న కేసీఆర్‌ క్షేమాన్ని కోరుతూ పలు చోట్ల ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు.

144 సెక్షన్‌ అమల్లో ఉన్నా చాలా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపులు నిర్వహించారు. ఏబీవీపీ కార్యకర్తలు కొందరు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు రాజ్‌భవన్‌ ముట్టడి యత్నాన్ని వమ్ము చేశారు. బంద్‌ ప్రభావం జంటనగరాల్లో స్పష్టంగా కనిపించింది. శనివారం అర్ధరాత్రి నుంచే పెట్రోల్‌బంకులు మూతబడ్డాయి. ఆదివారం ఉదయం అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసి కనిపించాయి. చివరకు పాన్‌డబ్బాలు కూడా తెరవలేదు.

దాంతో రోడ్లన్నీ బోసిపోయాయి. టీఆర్‌ ఎస్‌, ఏబీవీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై షాపులు తెరిచి ఉన్న చోట తిరుగుతూ వాటిని మూసివేయించారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల చిన్న చిన్న గొడవలు జరిగాయి. రామాంతాపూర్‌లో ఓ వైన్‌ షాప్‌ తెరిచి ఉండగా నిరసనకారులు దానిపై దాడి చేశారు. మద్యం బాటిళ్లను పగులగొట్టారు. దాంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. అంతకు ముందు శనివారం అర్ధరాత్రి వనస్థలిపురంలోని దుర్గావిలాస్‌ హోటల్‌కు కొంతమంది నిప్పు పెట్టారు.

ఆ సమయంలో హోటల్‌ ఉద్యోగులు లోపలే ఉన్నారు. హోటల్‌ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోగా ఉద్యోగులు వెనక భాగంలో గోడకు ఉన్న రంధ్రం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక, సహారా స్టేట్స్‌ ఎంట్రెన్స్‌ గేటుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణ స్టేట్స్‌ అన్న బోర్డును తగిలించారు. ఎల్‌ బినగర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. టీఆర్‌ ఎస్‌ నాయకుడు సుర్వి వెంకటేశ్‌గౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఇబ్రాం శేఖర్‌ల నేతృత్వంలో కార్యకర్తలు ఊరేగింపులుగా బయల్దేరి దుకాణాలు మూసివేయిస్తూ ఎల్‌బినగర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు.

దాంతో విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎల్‌బినగర్‌ పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకో చేస్తున్నవారిని అక్కడి నుంచి తరలించారు. ఆ తరువాత వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. వనస్థలిపురంలో ఏబీవీపీ కార్యకర్తలు ఓ హోటల్‌ను మూసివేయించటానికి ప్రయత్నించినపుడు హోటల్‌ సిబ్బంది వారిపై మరుగుతున్న నీళ్లు చల్లారు. దాంతో ఏబీవీపీ కార్యకర్తలు కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఈ విషయం దావానలంలా వ్యాపించటంతో ఏబీవీపీ,టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

అయితే పోలీసులు సకాలంలో వచ్చి పరిస్థితులు అదుపు తప్పకుండా చూడగలిగారు. తుర్కయంజాల్‌లో నిరసనకారులు బస్సుల అద్దాలు పగులగొట్టారు. తెరిచి ఉన్న ఏటీఎం సెంటర్‌లోకి చొరబడి, అద్దాలను ధ్వంసం చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న అన్‌మోల్‌ కాంటినెంటల్‌ హోటల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. చిక్కడపల్లి ప్రాంతంలో ఒమెగా హోటల్‌ తెరిచి ఉండగా ఆందోళనాకారులు దానిపై దాడి జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. శాంతినగర్‌లో మహాత్మగాంధీ విగ్రహానికి కొందరు నిరసనకారులు నల్లరంగు పూశారు.మౌలాలిలోతెలంగాణ రావాలని కోరుకుంటూ నిరసనకారులు అమ్మవారికి పూజలు చేశారు. ఇక, నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమరణ నిరాహారదీక్షను కొనసాగిస్తున్న కేసీఆర్‌ క్షేమాన్ని కోరుకుంటూ రామాంతాపూర్‌లో వేదపండితులు రుద్రయాదం జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+