అసెంబ్లీ సోమవారానికి వాయిదా
శాసనసభ్యుల రాజీనామాలపై శుక్రవారం అంతకు ముందు శాసనసభలో చర్చ జరిగింది. సభలో కేవలం 83 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో సభను నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజారిటీ సభ్యులు లేనందున సభను ఎలా నడుపుతారని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ తాను రాజీనామాలను ఆమోదించే వరకు వారు కూడా సభ్యులేనని స్పీకర్ అన్నారు. దీనిపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలని అక్బరుద్దీన్ కోరారు.
సభలో తెలంగాణ తీర్మానం చేయాలనే నిర్ణయం సరైందేనని, అయితే అందుకు అనుసరించిన విధానమే బాగా లేదని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. రాజీనామాలను వెనక్కి తీసుకుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఐ సభ్యుడు మల్లేష్ కోరారు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించి సభ్యులు రాజీనామాలు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పీకర్ ను కోరారు. అయితే ఎట్టకేలకు సభ్యుల సంఖ్య సరిగా లేకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.