ఉప ముఖ్యమంత్రిగా జానా రెడ్డి?
సీమాంధ్రకు చెందిన రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నందున తెలంగాణకు చెందిన జానారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించి శక్తివంతమైన హోం మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రాంతీయ బోర్డులను కూడా పునరుద్ధరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా చేయడం ఒక రకంగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడమే. కాగా, ఉప ముఖ్యమంత్రి పదవికి ఎస్సీ అయిన జె. గీతా రెడ్డి కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. చాలా కాలంగా రోశయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణపై చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత అందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ నాయకులెవరూ పదవులు చేపట్టబోరని కాంగ్రెసు తెలంగాణ నాయకులు అంటున్నారు. తెంలగాణవారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెసు తెలంగాణ కార్యాచరణ కమిటీ కన్వీనర్ బస్వరాజు సారయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ స్థితిలో తెలంగాణ శాసససభ్యులెవరూ కూడా మంత్రి పదవులు తీసుకునే పరిస్థితి లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మంత్రి పదవులు తీసుకున్నారంటే రాజకీయ భవిష్యత్తుకు తెరపడుతుందనే భయం కూడా వారిలో ఉంది. మంత్రి పదవులు స్వీకరిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.