ఒకప్పుడు బౌద్ధ రాజ్యం.. ఇప్పుడు ఇస్లామిక్ దేశం: 900 ఏళ్ల క్రితం అక్కడ ఏం జరిగింది?
ఒకప్పుడు అదో బౌద్ధ రాజ్యం. భారత్, శ్రీలంకలకు బౌద్ధాన్ని విస్తరించిన అశోకుడు, అతని వారసులు ఇక్కడ కూడా ఆ మతాన్ని విస్తరించారు. అంతే కాదు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని బౌద్ద రాజ్యాన్నే స్థాపించారు. కానీ 900 ఏళ్ల క్రితం ఉన్నట్లుండి హఠాత్తుగా ఆ దేశాన్ని పాలిస్తున్న బౌద్ద రాజు కాస్తా తన మతాన్ని వీడి ఇస్లాంలోకి మారిపోయాడు. అంతే అప్పటి నుంచి 900 ఏళ్లుగా అది ఇస్లామిక్ రాజ్యంగానే కొనసాగుతోంది. అయితే ఆ 9 శతాబ్దాల క్రితం ఏం జరిగిందన్న అంశం మాత్రం అంతా మర్చిపోయారు. ఇప్పటికీ ఇతర మతస్థులకు పౌరసత్వం సైత ఇవ్వ కుండా అది ఇస్లామిక్ రాజ్యంగా కొనసాగుతూ వస్తోంది. అదే మాల్దీవులు (Maldives).
మాల్దీవుల మత మార్పిడి వేడుకలు (Maldives)
మాల్దీవులు ఇస్లాం మతాన్ని స్వీకరించి 900 హిజ్రీ (ఇస్లామిక్ శకం) సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు నేతృత్వంలో ఏడాది పొడవునా ప్రత్యేక వేడుకలను ప్రారంభించారు. ఇస్లాం మతం తమ దేశ సార్వభౌమాధికారానికి రక్షణ కవచమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అయితే, నేడు పూర్తి స్థాయి ఇస్లామిక్ దేశంగా మారిన ఈ ద్వీపసమూహం వెనుక ఒకప్పుడు సుసంపన్నమైన హిందూ, బౌద్ధ చరిత్ర దాగి ఉందన్నది చారిత్రక సత్యం. నేటి ఆధునిక మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం అక్కడ ఇస్లాం మాత్రమే అధికారిక మతం. ముస్లిమేతరులకు పౌరసత్వం లభించదు.

మతమార్పిడి చరిత్ర.. హింసాత్మక ఆనవాళ్లు
14వ శతాబ్దపు సుప్రసిద్ధ యాత్రికుడు ఇబ్న్ బటూతా కథనాల ప్రకారం, ఒక సముద్ర రాక్షసుడి నుండి మాల్దీవులను రక్షించిన ముస్లిం సూఫీ గురువు అద్భుతాన్ని చూసి, అప్పటి చివరి బౌద్ధ రాజు ధోవేమి 1153 లో ఇస్లాంలోకి మారారు. కానీ, వివాదాస్పదమైన ఈ కథనాల కంటే చారిత్రక రాగి శాసనాల్లో భిన్నమైన నిజాలు ఉన్నాయి. 12వ శతాబ్దపు తామ్రపత్రాలు మాల్దీవులలో బౌద్ధ విహారాల ధ్వంసాన్ని, మతమార్పిడి ప్రక్రియలో జరిగిన దాడులను, తీవ్రమైన హింసను వెల్లడిస్తున్నాయి. క్రీస్తుశకం 1879లో ఒక బ్రిటిష్ నౌక ప్రమాదానికి గురైన ఘటన మాల్దీవుల ప్రాచీన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఘటనపై దర్యాప్తు కోసం వచ్చిన బ్రిటిష్ అధికారి హ్యారీ చార్లెస్ పూర్విస్ బెల్ అక్కడి వింత మట్టి దిబ్బలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికులు 'హవిత్త' లేదా 'ఉస్తుబు' అని పిలిచే ఆ దిబ్బలు బౌద్ధ స్థూపాలేనని ఆయన కనుగొన్నారు. తవ్వకాల్లో బయటపడిన శిల్పాలు మాల్దీవులకు భారతదేశం, శ్రీలంకలతో ఉన్న పురాతన సాంస్కృతిక సంబంధాలను వెల్లడించాయి.

ఆధునిక యుగంలో మాల్దీవులు
గత కొన్నేళ్లుగా మాల్దీవుల్లో అతివాదం పెరుగుతోంది. 2012లో మాలేలోని నేషనల్ మ్యూజియంలో విలువైన బౌద్ధ అవశేషాలను దుండగులు ధ్వంసం చేశారు. అలాగే స్వేచ్ఛా గొంతుకైన యామీన్ రషీద్ వంటి బ్లాగర్లను దారుణంగా హత్య చేశాలు. ఇలాంటి ఘటనలు అక్కడి మత మార్పిడి పూర్వ చరిత్రను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నాల్లో భాగమేనన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ పర్యాటక స్వర్గధామంగా పేరొందిన మాల్దీవులలో.. అధ్యక్షుడు ముయిజ్జు నేతృత్వంలో సౌదీ అరేబియా నిధులతో భారీ మసీదులు, ఇస్లామిక్ శిల్పకళా కేంద్రాలను నిర్మిస్తున్నారు. దేశీయంగా ఇస్లామిక్ అస్తిత్వాన్ని ఎంత బలపరుస్తున్నప్పటికీ, అక్కడి మసీదుల పునాదుల్లో, భూగర్భంలో దాగి ఉన్న ప్రాచీన హిందూ, బౌద్ధ వారసత్వ ఆనవాళ్లను మాల్దీవుల భౌగోళిక చరిత్ర నుండి వేరు చేయలేము.














Click it and Unblock the Notifications
