హైదరాబాద్ పునర్నిర్మాణంలో ప్రిన్స్ ఆగా ఖాన్ సహకారం కోరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-V తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా ఆయనతో విస్తృతంగా చర్చించారు.
డిసెంబర్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గ్లోబల్ సమిట్'కు హాజరు కావాల్సిందిగా ప్రిన్స్ రహీమ్ను ఆహ్వానించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా, పర్యాటకం, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని కోరారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్- V హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు రేవంత్ రెడ్డి.

తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణలో ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, ఈ ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ను పునరుద్ధరించామని వివరించారు.
హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై సిద్ధం చేసిన ప్రణాళికలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. మూసీ నది వెంట నైట్ ఎకానమీ కార్యకలాపాల దిశగా తీర్చిదిద్దుతున్న విషయాలను తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో సహకారం కావాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు వివరించారు.
ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ ఆగా ఖాన్ అడిగి తెలుసుకున్నారు. 30,000 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో నిర్మించే ఈ సిటీ నెట్ జీరో సిటీగా ఉండబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.













Click it and Unblock the Notifications
