రోశయ్య మంత్రివర్గాన్ని విస్తరిస్తారా?

తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీని నియమించడంతో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొందని, రోశయ్య ఇక తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ శాసనసభ్యులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో రాయలసీమకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. కాగా, తెలంగాణకు చెందిన సీనియర్ శాసనసభ్యులకు మంత్రిపదవులు ఇవ్వవచ్చునని కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా మంత్రి పదవులు చేపట్టే పరిస్థితి లేదు. మంత్రి వర్గ విస్తరణ ఆలోచనను విరమించుకోవాలని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి రోశయ్యకు సలహా ఇచ్చారు. తెలంగాణవారు పదవులు చేపడితే తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసుకుంటారని కూడా ఆయన అన్నారు.
తెలంగాణలో మంత్రులుగా కొనసాగుతున్నవారే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. వారు గ్రామాల్లో సంచరించే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు చుట్టుముట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామాలు చేయాలని పట్టుబడుతున్నారు. వారు ప్రజలను సముదాయించలేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని వారు ఎంత చెప్పినా వారు నమ్మడం లేదు. ఈ స్థితిలో కొత్తగా మంత్రి పదవులు తీసుకునే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనడంలో సందేహం లేదు. పదవుల కోసమే తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని వారిపై విమర్శలు రావడం ఖాయం. దాని వల్ల భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లి, వ్యక్తిగత రాజకీయ జీవితంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. దాని వల్ల వారెవరు కూడా మంత్రి పదవులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ స్థితిలో తెలంగాణవారిని కాదని, సీమాంధ్ర శాసనసభ్యులతో మంత్రి వర్గాన్ని రోశయ్య విస్తరిస్తారని అనుకోలేం. అందువల్ల మరోసారి రోశయ్య మంత్రివర్గ విస్తరణ ప్రయత్నం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications