శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ఉత్కంఠ
కుటుంబానికి చెందిన కొన్ని పనులు ఉండడంతో ఆయన ఈనెల 13 నుంచే కమిటీపై దృ ష్టి పెడతానని శ్రీకృష్ణ ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. 13న ఆయన ఢిల్లీకి వస్తారని, అదే రోజు కమిటీ తొలి సమావేశం జరగవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో కమిటీకి సహకరించేందుకు వివిధ శాఖల కు చెందిన అధికారులను గుర్తించాల్సిందిగా కేంద్రం రాష్ట్రాన్ని కోరినట్లు తెలిసింది. విధివిధానాల గురించి జస్టిస్ శ్రీకృష్ణతో చర్చించడం పూర్తయిందని, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఇతర కోర్ కమిటీ సభ్యులు వీటిని అంతకుముందే ఆమోదించారని సమాచారం. కమిటీ సభ్య కార్యదర్శి, హోంశాఖ మాజీ కార్యదర్శి దుగ్గల్ విధి విధానాల గురించి ఢిల్లీలో చర్చించిన తర్వాత ముంబైకి వెళ్లి జస్టిస్ శ్రీకృష్ణను కలిసిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణ కూడా తన అభిప్రాయాన్ని చి దంబరంతో పంచుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. విధి విధానాలు వివాదాస్పదం కాకుండా ప్రకటించాలనే బాధ్యతను సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి అప్పజెప్పినట్లు తెలిసింది. విధి విధానాలను ప్రకటించేప్పుడు కూడా ఎటువైపూ మొగ్గు చూపుతున్నట్లు అనుమానాలు తలెత్తనివ్వని పదజాలాన్ని ప్రణబ్ పొందుపరిచినట్లు తెలిసింది. ప్రధానంగా, ఆర్థిక, భౌగోళిక, నీటి పారుదల, శాంతి భద్రతలు, రాజధాని అంశాలను శ్రీకృష్ణ కమిటీ పరిశీలించే అవకాశాలున్నాయి. కమిటీలో నియమించిన నిపుణులు కూడా దాదాపు ఇవే రంగాలకు చెందిన వారు కావడం గమనించాల్సి ఉంది.