నన్నయ విశ్వవిద్యాలయానికి మంచి రోజులు
అక్నూకు భవనాలు నిర్మించేందుకు స్థల సేకరణ సమస్యగా మారిన సంగతి తెలిసిందే. రాజానగరం మండలం వెలుగుబంద వద్ద 165 ఎకరాలు సేకరించి 'నన్నయ'కు భవనాలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు భూ యజమానులు కోర్టుకు వెళ్లడంతో స్థల సేకరణకు ఆటంకం ఏర్పడింది. దీంతో మూడేళ్లుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ అటానమస్ కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో అక్నూ తరగతులు నిర్వహిస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన ఇద్దరు భూయజమానులను కూడా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాగైనా 165 ఎకరాల భూసేకరణ పూర్తిచేసి భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. భూమి కొనుగోలు చేసినప్పుడు చెల్లించేందుకు రూ. 30 కోట్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం వద్ద డిపాజిట్ చేసి ఉంచారు.
నన్నయ విశ్వవిద్యాలయం స్థల సేకరణ విషయమై చర్చించేందుకు రాజమడ్రికి చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కె.రోశయ్యతో గురువారం భేటీ కానున్నారు. ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఏపీఐఐసీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సీఎంను కలవనున్నారు.