వైయస్ జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు కొంప ముంచిందా?
తెలంగాణ నాయకులను చులకన చేస్తూ జగన్ వర్గం చేసిన వ్యాఖ్యలు, పార్లమెంటులో తెలంగాణను వ్యతిరేకిస్తూ ప్లకార్డు ప్రదర్శిస్తూ తన సీమాంధ్ర వైఖరి, తెలంగాణలో పర్యటించి తీరుతాననే ఆధిపత్య ధోరణి తెలంగాణ ప్రజల కడుపు మంటకు కారమైందని అంటున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తనను అడ్డుకుంటున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయని చెబుతున్నారు. తాను మాత్రమే తెలంగాణను ఉద్దరిస్తాననే ప్రభు వచనాలు కూడా తెలంగాణ ప్రజలకు నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ప్రజల్లో సీమాంధ్ర నాయకుల ఆధిపత్య ధోరణి బాహాటంగా ముందుకు రావడంతో తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు మరింతగా బలపడిందనే వ్యాఖ్య వినిపిస్తోంది. వైయస్ కోసం మరణించినవారు తప్ప, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు జగన్ పట్టనప్పుడు తెలంగాణకు జగన్ మేలు చేసేందుకు రావడం లేదనే భావన బలంగా నాటుకుపోయిందని అంటున్నారు.