అవిశ్వాసంపై చంద్రబాబునాయుడు, వైయస్ జగన్ కలిసి పనిచేస్తారా?

చంద్రబాబు రైతు వ్యతిరేకి అని చిత్రీకరించడానికి వైయస్ జగన్ మీడియానే కాకుండా ఆయన వర్గానికి చెందిన నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే, రైతు పక్షపాతం తమదేనని చాటుకోవడానికి వారు పోటీ పడుతున్నారని కూడా అనుకోవచ్చు. కానీ వైయస్ జగన్ దానితోనే సరిపెట్టుకోవడం లేదు. చంద్రబాబును సాధ్యమైనంతగా బలహీరపరిచే ఉద్దేశంతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే సాక్షి మీడియా ప్రచారం సాగిస్తోంది.
చంద్రబాబు, వైయస్ జగన్ లక్ష్యం ఒక్కటే కావడం వల్ల విభేదిస్తూనే లక్ష్య సాధన కోసం పని చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తన సత్తా చాటడానికి, తన బలమెంతో నిరూపించడానికి లభించే అవకాశాన్ని వైయస్ జగన్ వదులుకోరనే మాట వినిపిస్తోంది. దానివల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు సహకరించినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. అయితే, చిరంజీవి మాత్రం వారికి సహకరించకపోవచ్చు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము ఆదుకుంటామని చిరంజీవి పలు మార్లు చెప్పారు.
ఆలా చేయడానికి అవసరమైన వాదనను ఆయన రూపొందించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసం తీర్మానాన్ని బలపరిచి అధికారం కోసం అర్రులు చాస్తున్నట్లు అనిపించుకోవాల్సి వస్తుందని వైయస్ జగన్ వెనక్కి పోయినా పోవచ్చు. తమకు ప్రభుత్వం పడిపోవడం ముఖ్యం కాదని, రైతు సమస్యల పరిష్కారం ముఖ్యమని, చంద్రబాబు అధికారం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారని కూడా వాదించవచ్చు. ఏమైనా, ప్రతిపక్షాల మధ్య ఉన్న విభేదాల వల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించినా ఆశ్చర్యం లేదు. బహుశా, అందుకేనేమో తాము అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications