ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది: నిప్పులు చెరిగిన జగన్

తుఫాన్ల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైపోయిందని ఆయన అన్నారు. వైయస్సార్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కదా, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏదో మేరకు ఔదార్యం ఉంటుందని తాను భావించానని ఆయన అన్నారు. పదిశాతం ధాన్యానికి మాత్రమే మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం అంటోందని, ప్రభుత్వానికీ వ్యాపారులకూ తేడా లేకుండా పోయిందని ఆయన విమర్సించారు. రైతుల పూర్తి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో రైతులకు బోనస్ ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మన రాష్ట్రంలో రైతును ఆదుకోకపోవడం పట్ల తాను సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు.
రబీలో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు కోసం వైయస్సార్ మంజూరు చేసిన మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన అన్నారు. పావలా వడ్డీకి రుణాలను చేనేత కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా మూడేళ్ల సమయం ఉందని ప్రభుత్వం అనుకుంటూ వుండవచ్చునని, కళ్లు మూసి తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయని, అప్పుడు కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. ఈ సామూహిక దీక్ష ప్రకంపనలు ఢిల్లీకి వినిపించాలని, వారిలో కదలిక వస్తే ఈ ప్రభుత్వం పలుకుతుందేమో చూడాలని ఆయన అన్నారు. రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి చేతులు జోడించి విన్నవించుకుంటున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications