అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెసు తెలంగాణ నాయకులు
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే రాజీనామాలు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ పని చేయగలరా అనేది సందేహంగానే ఉంది. రాజీనామాలు చేయకుండా మాటలతో కాలం వెళ్లదీయడం కూడా అంత సులభంగా వారికి కనిపించడం లేదు. కాంగ్రెసు పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉత్సహాన్ని నింపింది. తెలంగాణ పట్ల కేంద్ర వైఖరిపై తెలుగుదేశం తెలంగాణ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఒక్కరినే పిలవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము చెప్పిన మాటలే నిజమని తేలిందని వారు అంటున్నారు. కాంగ్రెసు వైఖరి తెలంగాణపై తేటతెల్లం అయితే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరి చెబుతారంటూ ఇంత కాలం గడుపుతూ వచ్చిన వారి పంట పండినట్లే అయింది. కాంగ్రెసు నాయకులపైనా, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపైనా వారు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.
కాగా, కాంగ్రెసు తెలంగాణ నేతలను కెసిఆర్ పూర్తిగా ఇరకాటంలో పెడుతున్నారు. ఇప్పుడు భారమంతా ఆయన వారిపై మోపుతున్నారు. చాలా కాలంగా ఆయన తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెసు తెలంగాణ నాయకులపై విరుచుకుపడుతున్నారు. ఆయన తన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. రాజీనామాలు చేస్తారా, తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా అని ఆయన కాంగ్రెసు తెలంగాణ నాయకులపై ఒత్తిడి తీవ్రం చేయనున్నారు. అంతేకాకుండా, తెలంగాణలో తిరగలేని పరిస్థితిని ఆయన కల్పించవచ్చు. ఏమైనా, కాంగ్రెసు తెలంగాణ నాయకులు అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.