శ్రీకృష్ణ కమిటీపై భగ్గుమంటున్న తెలంగాణ కాంగ్రెసు నేతలు

6నే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఏడో తేదీని ఎంపీలు సహా ముఖ్యమైన నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వాలని తీర్మానించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకూడదంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయాలన్న దానిపై కూడా చర్చించారు. సీనియర్ నేత కె.కేశవరావు, మంత్రి కె.జానారెడ్డి, ఎంపీలు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్రెడ్డి, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ప్రతాప్రెడ్డి, ముత్యంరెడ్డి, ఆరేపల్లి మోహన్, ప్రవీణ్రెడ్డి, ప్రసాద్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఇంద్రసేన్రెడ్డి, కేఆర్ ఆమోస్, టి.భానుప్రసాదరావు, జగదీశ్వరరెడ్డి, వి.భూపాల్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బి.కమలాకరరావులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కేంద్రం తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది పోయి ఇప్పుడు మళ్లీ చర్చల కోసం సమావేశాలు పెట్టడం ఎందుకని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. జస్టిస్ శ్రీకృష్ణ, ఆ కమిటీ సభ్యులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యే రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. ఈ మేరకు నేతలు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఒకవేళ ప్యాకేజీల్లాంటి ప్రత్యామ్నాయాల్ని కమిటీ సూచించినా.. వాటికి అంగీకరించేది లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి తేల్చి చెప్పాలని నేతలు నిర్ణయించారు. తెలంగాణలో 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి తెలంగాణను కేంద్రం ఇవ్వాలన్న ఆలోచనలో ఉందని సీనియర్ నేత కేశవరావు సమావేశంలో అన్నట్లు తెలిసింది. 20 మందేంటి 25 మంది ఉన్నాం, కావాలంటే ఇప్పుడే జాబితా ఇస్తాం అని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అన్నట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే తన రాజీనామా పత్రాన్ని చూపినట్లు తెలిసింది. "పదవులు మాకు తృణప్రాయం. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటున్నాం. పదవులు ఓ లెక్కా?. తెగించాం. తెగబడి ముందుకు వెళతాం" అని ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు.
ఈ సమావేశం తర్వాత నేతలు బయటికొచ్చి విలేకరులతో మాట్లాడారు. 11 మంది తెలంగాణ ఎంపీలు 6వ తేదీ భేటీ అయి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడని, ఆయన మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు, ఛైర్మన్ తమ నివేదిక గురించి మీడియాకు బహిరంగంగా లీకులు ఇస్తూ, వ్యాఖ్యలు చేయడం అనైతికమని ఎంపీ జగన్నాథం అన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా వారు ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణకు, పార్టీకి కట్టుబడి ఉన్నామని ఎంపీ గుత్తా చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ సాధించుకుంటామన్నారు. 'ఒకవేళ అధిష్ఠానం అంగీకరించకపోతే మా చావు మాది.. ఎవరి చావు వారిది' అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో 6న జరిగే అఖిలపక్ష సమావేశం వృథా అని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అభిప్రాయపడ్డారు. సమావేశాన్ని బాయ్కాట్ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications