వైయస్ జగన్ ఇష్యూయే కాడు, తెలంగాణే పెద్ద సమస్య: బొత్స సత్యనారాయణ
తెలుగుదేశం ద్వారా మాత్రమే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తీసుకునే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు అంగీకరించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేశారని ఆయన చెప్పారు. పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
తెలంగాణపై సోనియా అభిప్రాయం చెప్తే చంద్రబాబు చెప్తారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అంటే అటువంటి లింక్లే పెట్టకూడదని, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారం గురించి పనిచేయాలని మంత్రి అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కార బాధ్యతను తెలుగుదేశం కూడా కాంగ్రెసు మీద పెట్టమనండని ఆయన అన్నారు.