కాంగ్రెసుకు చిక్కులు: తెలంగాణ ఎంపీలతో ప్రణబ్ భేటీ, సీమాంధ్రుల విజ్ఞప్తి
తెలంగాణపై తాము ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నామో ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పార్లమెంటు సభ్యులకు వివరించే అవకాశం ఉంది. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి తమకు సహకారం అందించాలని ఆయన సూచిస్తారని అంటున్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ వాదనలను వినిపించడానికి అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు వ్యాఖ్యలను కూడా వారు ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తెస్తారని అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, ఆ పరిస్థితిలో తాము పట్టుబట్టాల్సిన అనివార్యతలోకి ఎలా వెళ్లిందీ వారు ప్రణబ్కు వివరించే అవకాశం ఉంది.
కాగా, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రణబ్ ముఖర్జీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రత్యామ్నాయానికి తాము కట్టుబడి ఉంటామని పార్లమెంటు సభ్యులు ఆ ఇద్దరు నేతలకు చెప్పారు. దానిపై మరోసారి సమావేశమవుదామని ప్రణబ్ ముఖర్జీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో చెప్పారు. మొత్తం మీద, తెలంగాణ అంశంపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ స్థితిలోనే సివిసిగా థామస్ ఎంపిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెసుకు తలనొప్పిగా పరిణమించింది. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు కాంగ్రెసు యుపిఎ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.