మిలియన్ మార్చ్ యథాతథం: పరీక్ష దృష్ట్యా 1 నుండి ప్రారంభం
సోమవారం సాయంత్రం జేఏసి చర్చించి మార్చ్ యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. మార్చి 10వ తేదిన ప్రజలు రోడ్లపైనే వంటావార్పు చేసుకోవారని కోరారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఆకాంక్షను తెలియజేయాలన్నారు. పరీక్షల దృష్ట్యా మార్చ్ మధ్యాహ్నం 1 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కోదండరాం చెప్పారు. కాగా ఇంటర్ పరీక్షల దృష్ట్యా, తెలంగాణ ఉద్యమం దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో నిషేధాజ్ఞలు ఉన్నాయని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ తెలిపారు.
ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలకు ఎక్కడా మార్చి 13వ తారీఖు వరకు ఆమోదించలేదన్నారు. పరీక్షల దృష్ట్యా అందరూ సహకరించాలని ఆయన కోరారు. నగరంలో 144వ సెక్షన్ ఉంటుందని అన్నారు. ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా సైబరాబాద్ పరిధిలో కూడా కఠిన ఆంక్షలు ఉంటున్నట్టు కమిషనర్ తిరుమలరావు చెప్పారు.