వికీలీక్స్పై అట్టుడికిన పార్లమెంటు, పిఎం రాజీనామాకు డిమాండ్
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎన్నో నీతి సూత్రాలు వల్లె వేస్తున్నదని, కాని ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు ఈ ప్రభుత్వం ఎప్పుడో కోల్పోయిందని, ఇంత జరిగినా ఇంకా అధికారంనుంచి ఎందుకు తప్పుకోరని భారతీయ జనతా పార్టీ నాయకులు సుష్మా స్వరాజ్, ఎల్.కె. అద్వాని, అరుణ్ జైట్లీ ఉభయ సభలలోనూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న వాదాన్ని పునరుద్ఘాటిస్తూ వామ పక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడంలో భారతీయ జనతా పార్టీతో గొంతు కలిపాయి.
అయితే ఎప్పుడో 14 వ లోక్ సభలో జరిగినవని చెబుతున్న అంశాలతో ప్రస్తుత 15 వ లోక్ సభకు సంబంధం లేదని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధించారు. 14 వ లోక్ సభ ఎప్పుడో రద్దు అయ్యిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజల చేత ఎన్నుకున్న 15 వ లోక్సభ కే ప్రస్తుత ప్రభుత్వం జవాబుదారీ గాని ముగిసిపోయిన 14 వ లోక్ సభలో జరిగినవని చెబుతున్న అంశాలకు కాదని ఆయన వివరించారు.