వికీలీక్స్ పచ్చి నిజం, సిగ్గుపడాలి: ప్రధానిపై చంద్రబాబు ధ్వజం
ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవడానికి ఎంపీలను కొనుగోలు చేయడం నీతిమాలిన చర్య అన్నారు. ఎంపీల కొనుగోలుకు ఆదికేశవలునాయుడే ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. అధికారమే పరమావధిగా కేంద్రం చూస్తుందన్నారు. సతీష్ శర్మ అనుచరుడు వోట్ ఆఫ్ కాన్ఫడెన్సులో గెలవడానికి డబ్బులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. మాజీ ప్రధాని వాజపాయి అల్లుడు రంజన్ భట్టాచార్యను కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేశారన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్కు పార్లమెంటులో ఎంపీల కొనుగోలు దురదృష్టకరమన్నారు.
అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యుడు మన్మోహన్ సింగ్ అన్నారు. మన్మోహన్ సింగ్ తనకేమీ పట్టనట్టుగా వ్యవరిస్తున్నారన్నారు. ఈ దేశంలో జరిగిన వాటికి బాధపడాల్సింది, సిగ్గుపడాల్సింది పోయి, ప్రధాని మాటలు వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉండటం శోచనీయమన్నారు. నిస్సహాయంగా ఉన్న ప్రధాని సంకీర్ణ రాజకీయల వైఫల్యం అని చెప్పడం సరికాదన్నారు. 2జి స్పెక్ట్రం తదితర కుంభకోణాలపై సుప్రీంకోర్టు మొట్టిన తర్వాతే జెపిసి వేశారన్నారు. మరో కేంద్రమంత్రి అవిశ్వాసంలో నోటుకు ఓటుపై అది గత సభలో విషయమని, ఇది 15వ లోక సభ అనిచెప్పడం విడ్డూరమన్నారు. రాజా అనుచరుడు బచ్చా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.