వివేకాను బర్తరఫ్ చేయాలి, జగన్ వర్గంను సస్పెండ్ చేయాలి: టిడిపి
టిడిపి కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వాటిపై జెఎల్పీ కోసం టిడిపి పట్టుబడిందన్నారు. వైయస్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు భారీగా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకున్నప్పుడు మాట్లాడని మంత్రి వివేకానందరెడ్డి వైయస్ పాలనలో జరిగిని అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానాలు చెప్పవలసిన మంత్రి దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శాసనసభలో ఇలాంటివి చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని మాజీ మంత్రి అశోక గజపతి రాజు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారు వీధి రౌడిల్లా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. టిడిపి సభ్యులపై దాడి చేసిన మంత్రి వివేకానందరెడ్డిని, జగన్ వర్గం ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో ఎవరికైనా ఏమైనా మాట్లాడే అర్హత ఉందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభలోకి వచ్చి రౌడీల్లా ప్రవర్తించడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అన్నారు. నేనే ముఖ్యమంత్రిని అయితే 5 నిమిషాలలో వారిని బర్తరఫ్ చేసేవాడిని అని అన్నారు. ముఖ్యమంత్రి వారిని సభ నుండి సస్పెండ్ చేయకుండే సరికాదన్నారు. అలా చేయకుంటే సభా హక్కుల ఉల్లంఘన పెడతామని అన్నారు.
అసెంబ్లీ పట్ల ప్రజాప్రతినిధులకు గౌరవం తగ్గిపోయినట్లుగా కనిపిస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో దాడి చేసే శాసనసభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరాచకానికి పాల్పడ్డవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో సభ్యులను సభనుండి సస్పెండ్ చేయాలన్నారు.