శ్రీనివాసులుకు బుజ్జగింపు, ఐదుగురు జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై వేటు
కొండా సురేఖ, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. ఆ ఐదుగురు శాసనసభ్యులపై మల్లుభట్టి విక్రమార్క, కొండ్రు మురళి శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు బుధవారం ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్ వారిపై అనర్హత వేటు వేస్తారని అంటున్నారు. వినకపోతే శ్రీనివాసులును కూడా ఆ ఐదుగురి జాబితాలో చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
కాగా, ఇతర జిల్లా శాసనసభ్యులు కడప లోకసభ నియోజకవర్గంలోకి ప్రవేశించకుండా కాంగ్రెసు అధిష్టానం కట్టడి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇతర జిల్లాలకు చెందిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు కడప నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం సాగించకుండా చూసేందుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం ద్వారా మిగతా శాసనసభ్యులకు చర్య తప్పదనే సంకేతాలు పంపాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.